పిరికిదాన్ని కాదు..వెంటాడి దెబ్బతీస్తా
నా వెంట కొత్తవారే ఉన్నా జనం కోసమే వారి పోరాటం
ఏ తప్పు చేయకుండానే జైల్లో పెట్టారు.. అప్పుడే నేను ఏ తప్పు చేయలేదని చెప్పా
నాలుగేళ్లు ఈడీ, సీబీఐ ఇబ్బంది పెట్టినా ధైర్యం సడలలేదు.. దారి తప్పలేదు
సొంతూరుకు వచ్చాక ఆపుకుందామన్న కన్నీళ్లు ఆగడం లేదు.. అలాగని నేను పిరికిదాన్ని కాదు
అమ్మ ఇంటివాళ్లు నిర్దాక్ష్యణ్యంగా తరిమేస్తే అత్తింటి వాళ్లు కన్న బిడ్డలా అక్కున చేర్చుకున్నారు
తండ్రి, కూతురును పాపిన ప్రశాంత్ రెడ్డిని జీవితంలో క్షమించను.. నా ఉసురు తగులుతుంది*
ప్రాదేశిక ఎన్నికల్లో అన్ని స్థానాల్లో పోటీ చేస్తాం
-తెలంగాణ రక్షణ సేన చీఫ్ కల్వకుంట్ల కవిత
(తెలంగాణ రక్షణ సేన, నిజామాబాద్)
అక్రమంగా జైలుకు పంపిస్తేనో..పార్టీలోంచి తీసేస్తేనో కుంగిపోయేంత పిరికిదాన్ని కాదని..రాక్షస లీడర్లను రాజకీయంగా భవిష్యత్తు లేకుండా చేసే అపర కాళినని తెలంగాణ రక్షణ సేన చీఫ్ కల్వకుంట్ల కవిత అన్నారు. తన వెంట పెద్ద లీడర్లు లేకున్నా నీతివంతులు, నిజాయితీ పరులే తనతో పాటు జనం కోసం పోరాడుతున్నారని స్పష్టం చేశారు. తెలంగాణ రాష్ట్రం వచ్చాక మనల్ని మనం పాలించుకున్నా పేదల జీవితాల్లో ఏమాత్రం మార్పు రాలేదన్నారు. పార్టీ పెట్టిన 4 నెలల తర్వాత సొంతూరు నిజామాబాద్ గడ్డకు వచ్చిన కవిత కలెక్టరేట్ మైదానంలో నిర్వహించిన పాంచజన్య సంకల్పసభలో పాల్గొని ప్రసంగించారు. ఈ సందర్భంగా ఆమె బీఆర్ఎస్, కాంగ్రెస్ పై తీవ్ర విమర్శలు చేశారు. తాను తప్పు చేయలేదని..నిప్పులాంటి నిజామాబాద్ బిడ్డనని స్పష్టం చేశారు. కష్టాల్లో తనను కడుపులో పెట్టుకుని అత్తింటివారు అండగా నిలిచారని చెప్పారు.
మీరే నాధైర్యం
“మిమ్మల్ని కలుసుకోవటం ఎంతో ఆనందంగా ఉంది.
మనల్ని మనం పాలించుకుని, మంచి చేసుకునేందుకు తెలంగాణ తెచ్చుకున్నాం. తెలంగాణ వచ్చాక కొంత మంచి జరిగింది. కానీ ఇంకా జరగాల్సిన మంచి చాలా ఉంది.
మనం తెలంగాణకు ఇంకా ఏం మంచి చేయాలన్న దానిపై మాట్లాడుకోవాల్సి ఉంది. తెలంగాణ వస్తే మన బతుకులు మారుతాయని ఊపిరి బిగపట్టి, పిడికిలెత్తి పోరాటం చేశాం.
12 వందల మంది బిడ్డల ప్రాణాలు ఆ పోరాటంలో పోయాయి. అది మన బతుకు పోరాటం. కానీ తెలంగాణ వచ్చాక నిజంగా మన బతుకులు మారాయా? ఒక్కసారి ఆలోచించాలి. పదేళ్లు బీఆర్ఎస్ కు అధికారం ఇస్తే లక్ష కోట్లతో కాళేశ్వరం కట్టారు. కానీ నిజామాబాద్ కు ఒక్క ఎకరానికి కూడా నీళ్లు రాలేదు. తెలంగాణ వచ్చాక కూడా మనకు మంచి జరగలేదు. అలాంటప్పుడు మనకు మంచి జరిగేందుకు కొత్తగా ఆలోచించాల్సిన అవసరం ఉంది. మన సమస్యలు పరిష్కారం కావాలంటే కొత్త శక్తి కావాల్సిన అవసరం ఉంది. నిజామాబాద్ కోడలిగా, మీ బిడ్డగా నన్ను 20 ఏళ్లుగా చూస్తున్నారు. నన్ను ఎంపీగా, ఎమ్మెల్సీగా గెలిపించారు. ఎక్కడకు పోయినా సరే మీ ధైర్యంతో నేను మాట్లాడుతాను. ఇవ్వాళ పదవుల కోసం కాకుండా ప్రజల కోసమే పార్టీ పెట్టాను. మళ్లీ నాకు మీరు ఆ ధైర్యం ఇవ్వాలి.
పదవుల కోసమే అంటే ఏ పార్టీకైనా నేను పోవచ్చు. కానీ ప్రజలకు మంచి చేయాలని పంతం పట్టి వస్తున్నా. నేను చూడని పదవులు లేవు, నాకు పదవులు కావాల్సిన అవసరం లేదు.”

కుట్రలతో జైలుకు పంపారు
“ఏం తప్పు చేశానని నన్ను తీహార్ జైల్లో పెట్టారు? నన్ను అన్యాయంగా జైల్లో పెట్టారని అప్పుడు మాట్లాడిన నాయకులు ఆ తర్వాత ఎందుకు మౌనంగా ఉన్నారు. 4 ఏళ్లు సీబీఐ, ఈడీ నన్ను ఎంత ఇబ్బంది పెట్టినా ధైర్యం సడలలేదు. దారి తప్పలేదు. నిప్పులాంటి నిజామాబాద్ బిడ్డను. నేను మొదటి రోజు నుంచి తప్పు చేయలేదనే చెప్పాను. సుప్రీంకోర్టు కూడా అదే విషయాన్ని తేల్చింది. నా మీద కేసు పెట్టినందుకు దేశంలో ఎప్పుడు లేని విధంగా సీబీఐ ఆఫీసర్ మీదనే ఎంక్వైరీ వేయాలని కోర్టు తీర్పు చెప్పింది. ఆడబిడ్డ కష్టాల్లో ఉంటే అక్కున చేర్చుకోవాల్సింది పోయి కర్కశంగా నన్ను బయటకు పంపారు. నన్ను ఎందుకు తీసేశారో అర్థం కావటం లేదు. సొంతూరుకు రావటంతో ఆవేదనతో ఆపుకుందామనుకున్న కన్నీళ్లు వస్తున్నాయి. అలాగని నన్ను పిరికిదాన్ని అని మాత్రం అనుకోవద్దు. ఆడబిడ్డకు బాధ ఉంటే కన్నీళ్లు వస్తాయి.
తెలంగాణకు ఇంకా చాలా చేయాల్సి ఉంది. పదవుల కోసం కాకుండా పంతం పట్టి ఇందూరు గడ్డ వేదికగా మీ ముందుకు వస్తున్నా. కష్టాల్లో మా అమ్మ గారి ఇళ్లు నిర్దాక్ష్యణ్యంగా వెళ్లగొడితే మా అత్త,మామలు కన్న కూతురిలా కడుపులో పెట్టి చూసుకున్నారు. అమ్మగారు వెళ్లగొడితే మీ కోసం వచ్చి నన్ను ఆశీర్వదించమని పబ్బతి పట్టి అడుగుతున్నా. రాష్ట్రంలో ఇప్పటికే ఇన్ని పార్టీలు ఉండగా మళ్లీ కొత్తగా పార్టీ ఎందుకు అని మీకు అనిపించవచ్చు. కానీ కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వచ్చి రేపటితో వెయ్యి రోజులు అవుతుంది. ఇన్ని రోజుల్లో ఒక్క హామీ అయినా సరిగా అమలు చేసిందా..? రైతు భరోసా ఆగమైంది, రైతులు ఆగమయ్యారు. ఒక్క హామీ కూడా అమలు చేయలేదు. ఈ ముఖ్యమంత్రి ఎన్నికలు వస్తే ఒట్లు పెడ్తడు.. ఆ తర్వాత తిట్లు పెడ్తడు. కానీ ప్రజల కోసం ఒక్క మంచి పని కూడా ఆయన చేయలేదు. దొంగ హామీలతో గద్దెనెక్కిన వాళ్లను మనం నిలదీయాలా వద్దా? కాంగ్రెస్ పార్టీని నిలదీయాల్సిన బీఆర్ఎస్ ఎందుకు మౌనంగా ఉంది?”
మరో ఉద్యమానికి ఆశీర్వదించండి
“కేసీఆర్ గారు తెలంగాణ కోసం సిద్దిపేట నుంచి బయలుదేరినప్పుడు అంతా ఆయన వెనుక నిలబడ్డారు.
నేను బహుజన తెలంగాణ కోసం బయలుదేరుతున్నా. మీ ఆశీర్వాదం నాకు కావాలి. ప్రజల జీవితంలో గుణ్మాత్మక మార్పు తేవాలని సంకల్పంతో ఉన్నా. మళ్లీ బీఆర్ఎస్ అవకాశం ఇస్తే అదే జీవన్ రెడ్డి, బాజిరెడ్డి గోవర్ధన్ రెడ్డి, ప్రశాంత్ రెడ్డి, గణేష్ గుప్తాలకే కదా టికెట్లు ఇస్తారు?
వాళ్ల కన్నా కూడా మా పార్టీలో ఉండే కొత్త యువ నాయకత్వానికి అవకాశం ఇవ్వండి. మేము ప్రతి నియోజకవర్గంలో షాడో ఎమ్మెల్యేలను తయారు చేస్తాం.
నిజామాబాద్ జిల్లాలో భూపతి రెడ్డి, సూర్య నారాయణ గుప్తా, సుదర్శన్ రెడ్డి, ప్రశాంత్ రెడ్డి లాంటి అక్రమాలు చేస్తున్న వాళ్ల వెంట పడుతాం. ఇంత అక్రమాలకు పాల్పడుతున్నా సరే కాంగ్రెస్ ప్రభుత్వం వారిని ఏమీ అనటం లేదు. కాంగ్రెస్ తో వాళ్లకున్న అండర్ స్టాండింగ్ ఏంటో ప్రజలకు తెలియజేయాలి. ఓ వైపు కాంగ్రెస్ పై పోరాటం చేస్తూనే…మరోవైపు టీఆర్ఎస్ ను నిర్మాణం చేసుకుంటాం. వచ్చే ఎంపీటీసీ, జడ్పీటీసీ ఎన్నికల్లో అన్ని స్థానాల్లో పోటీ చేస్తాం. మైనార్టీల హక్కుల కోసం వారి గొంతుకగా పోరాటం చేస్తాం. రైతులను ఇబ్బంది పెట్టేలా రాష్ట్ర, కేంద్ర ప్రభుత్వాలు తెచ్చిన యాప్ లను వెంటనే తొలగించాలి.”
ప్రశాంత్ రెడ్డిని క్షమించను
“నిజామాబాద్ జిల్లా వరకే చూస్తే కూడా బీఆర్ఎస్ ఎమ్మెల్యేలు ఎందుకు ప్రభుత్వాన్ని నిలదీయటం లేదు.
బోధన్ లో వరదలు వస్తే బీఆర్ఎస్ ఎమ్మెల్యే ఎప్పుడైనా వచ్చి ప్రజల కోసం ధర్నా చేసిండా? ప్రశాంత్ రెడ్డి, జీవన్ రెడ్డి, బాజిరెడ్డి గోవర్ధన్ రెడ్డి ప్రభుత్వాన్ని ఎందుకు ప్రశ్నింటం లేదు? ప్రతిపక్షం నిద్రపోతే మనం ఊరుకోవాలా? వాళ్ల నైజం గురించి ప్రజలకు తెలియచెప్పాలి. ప్రశాంత్ రెడ్డిని కేసీఆర్ గారు పెద్ద కొడుకు మాదిరిగా ఆదరించి ఇంట్లో కూర్చో బెట్టుకొని ఎన్నోసార్లు భోజనం పెట్టారు. ప్రశాంత్ రెడ్డి కూడా కేసీఆర్ మాదిరిగా ఉండేందుకు ప్రయత్నిస్తాడు. కానీ పులిని చూసి నక్క వాతలు పెట్టుకుంటే కుదురుతుందా? తండ్రిని, కూతురును ఎడపాపడంలో ప్రశాంత్ రెడ్డిదే మొదటి పాత్ర. హరీష్ రావును, సంతోష్ రావును క్షమిస్తానేమో గానీ ప్రశాంత్ రెడ్డిని క్షమించను. నా ఉసురు తప్పకుండా తాకుతుంది. బీఆర్ఎస్ ఓడిపోయిన రెండో రోజే కాంగ్రెస్ లోకి వెళ్లేందుకు ప్రశాంత్ రెడ్డి ప్రయత్నం చేసిండు. గంజాయి డబ్బులతో ముక్కి మూలిగి మూడు వేల ఓట్లతో గెలిచిండు. కానీ ఇక ప్రశాంత్ రెడ్డి రాజకీయాలు మర్చిపోవాలి. బాల్కొండ నుంచి పారిపోండి. మిమ్మల్ని వెంటబడి ఓడిస్తాం. ప్రశాంత్ రెడ్డిని గెలిపించేందుకు నాకు ఆరోగ్యం బాగాలేకపోయినా కష్టపడ్డాను. ఆయనకు మంత్రి పదవి కూడా వచ్చింది.
ఏం తక్కువైందని బీఆర్ఎస్ ఓడిపోయిన వెంటనే కాంగ్రెస్ కు వెళ్లాలని ప్రయత్నం చేసిండు. బాజిరెడ్డి గోవర్థన్ రెడ్డి, జీవన్ రెడ్డి, ప్రశాంత్ రెడ్డిలను నేను గెలిపిస్తే…వాళ్లే నన్ను ఓడించారు. వాళ్లంతా నన్ను ఓడించి మోసం చేస్తే కూడా నేను ఇంట్లో కూర్చోలేదు. మీ కోసం కష్టపడేందుకు పార్టీ పెట్టాను. బీఆర్ఎస్ వాళ్లు పదేళ్లు దోచుకున్న డబ్బు ఇప్పటికీ లెక్కపెట్టుకుంటున్నారు. మా పార్టీలోకి వచ్చే వాళ్లను బెదిరిస్తున్నారంట. బెదిరిస్తే భయపడే రోజులు పోయినయ్. నిజామాబాద్ లో ఐదుకు ఐదు సీట్లు గెలిచి తీరుతాం.”

హైడ్రాతో సర్కారు బెదిరింపు
“ఐదు కీలక అంశాలతో మన పార్టీ ముందుకు వెళ్తుంది.
శ్రీకృష్ణుడు చేతిలోని పాంచజన్య శంఖాన్ని మన ఐదు అంశాలకు పేరు పెట్టుకున్నాం. అధర్మం పెరిగిపోయినప్పుడు ధర్మాన్ని రక్షించేందుకు శ్రీకృష్ణుడు పాంచజన్యాన్ని పూరించాడు. శ్రీకృష్ణుడిని, పాంచజన్యాన్ని నమ్ముకున్న వాళ్లు ఓడిపోయినట్లు చరిత్రలో లేదు. పేద, మధ్యతరగతి వాళ్లు విద్య, వైద్యం కోసమే పెద్ద ఎత్తున ఖర్చు చేస్తున్నారు. ఇంట్లో ఎవరికైనా ఆరోగ్యం బాగాలేకపోతే ఎంతో కష్టపడి కూడబెట్టుకున్న ఇళ్లు, బంగారం అమ్ముకోవాల్సిన పరిస్థితి ఉంది. మమ్మల్ని గెలిపిస్తే ఉచిత విద్య, వైద్యం అందిస్తానని హామీ ఇస్తున్నా.
ఇవ్వన్నీ ఇవ్వటానికి డబ్బులు ఎక్కడివి అంటూ అబద్దాలు చెబుతారు. మనకు 2 లక్షల కోట్ల ఆదాయం ఉంది. లక్ష కోట్ల రూపాయలు విద్య, వైద్యం కోసం ఖర్చు చేయవచ్చు.
అదే విధంగా యువతకు 2 లక్షల నుంచి 20 కోట్ల రూపాయల వరకు వాళ్లు పరిశ్రమలు పెట్టుకునేందుకు లోన్లు ఇస్తాం. సామాజిక న్యాయం అంటే అన్ని రంగాల్లో అన్ని కులాల వాళ్లు ఉండాలి. అందుకోసం మా పార్టీ పోరాటం చేస్తుంది. అన్ని వర్గాలకు మేలు చేసే ప్రయత్నం చేస్తుంది. ఏ ఒక్క కులం బాగాలేకపోయినా సరే తెలంగాణ ముందుకు పోదు. అన్ని కులాలు బాగుండాలి. అగ్రవర్ణాల్లో పేదలు కూడా బాగుండాలి. భూమి లేక అర్హత ఉన్న పేదలకు కూడా ఎకరం భూమి ఇస్తాం. భూమి అనేది పేదవాళ్లకు ఒక గౌరవం, అందుకే భూలక్ష్మి పథకం ద్వారా ఎకరం భూమి ఇస్తాం. పేదలకు భూములు ఇవ్వాల్సిన కాంగ్రెస్ ప్రభుత్వం అసైన్డ్ భూములను లాక్కుంటున్నది.
హైదరాబాద్ లో హైడ్రా పేరుతో భయపడుతున్నది చాలక నిజామాబాద్ లో నిడ్రా అని పెట్టి పేదలను ఆగం చేస్తారంట. నిజామాబాద్ లో ఉన్న బీడీ కార్మికుల కోసం పెన్షన్ వచ్చేలా నేనే కృషి చేశాను. కానీ 12 ఏళ్లలో పెన్షన్ పెంచలేదు. కొత్త వాళ్లకు పెన్షన్ ఇవ్వలేదు. బోధన షుగర్ ఫ్యాక్టరీ తెరిపించేందుకు ఎంతో కృషి చేసినప్పటికీ కేసీఆర్ గారు దాన్ని తెరవలేదు. షుగర్ ఫ్యాక్టరీ కార్మికులకు 18 కోట్లు ఇవ్వాలంటే కేటీఆర్ గారు ఇవ్వలేదు. కేటీఆర్ దోస్త్ కోరుట్ల ఎమ్మెల్యే కోసమే షుగర్ ఫ్యాక్టరీ తెరవలేదని తర్వాత తెలిసింది. సారంగపూర్ లో షుగర్ ఫ్యాక్టరీ కోసం ధర్నా చేస్తున్న కార్మికులకు మద్దతిస్తున్నాం. అవసరమైతే వారి కోసం ఇక్కడ వచ్చి పోరాటం చేస్తా. ఖమ్మంలో వెలుగుమట్లలో పేదల ఇళ్లు కూల్చేస్తే మూడు రోజులు తినకుండా నిరాహార దీక్ష చేశా. దాంతో ప్రభుత్వం పేదలకు 400 ఇళ్లు కట్టిస్తామని హామీ ఇచ్చింది.”
అధర్మపురి
“నిజామాబాద్ ఎంపీ ధర్మపురి అర్వింద్…మాధవ్ నగర్ బ్రిడ్జిని ఏడేళ్లుగా ఎందుకు కట్టించలేకపోతున్నారు. నేను ఎంపీగా ఉన్నప్పుడు ఇదే బ్రిడ్జి నిర్మాణం పూర్తికాకపోతే కేకే ట్యాక్స్ అన్నావ్..మరి ఏడేళ్లుగా నువ్వు ఎందుకు బ్రిడ్జి పనులు పూర్తి చేయలేదు? నువ్వేం ట్యాక్స్ తీసుకుంటున్నావ్.? ఏడేళ్లుగా గాడిదల పళ్లు తోముతున్నావా..? ధర్మపురి అర్వింద్ పేరులోనే ధర్మం ఉంది. కానీ ఆయనలో మొత్తం అధర్మమే. ఆయన తెచ్చానని చెప్పుకుంటున్న పసుపు బోర్డు ద్వారా రైతులకు పైసా ప్రయోజనం లేదు. ప్రశ్నిస్తే అడ్డగోలుగా మాట్లాడటం తప్ప.. ప్రజలకు చేసిందేమీ లేదు. ఈ అర్వింద్, ప్రశాంత్ రెడ్డిలు కాంగ్రెస్ లోకి పోదామని అనుకుంటున్నారంట? అర్వింద్ కేసీ వేణుగోపాల్ ను కూడా కలిశాడంట.
ప్రజల కోసం పార్టీలు మారితే ఓకే.. కానీ పదవుల కోసం మారేవాళ్లను సహిద్దామా? చాలా మంది మా పార్టీలో పెద్ద నాయకులు లేరని అంటున్నారు. పెద్ద నాయకులున్న బీఆర్ఎస్ ను ఇంటికి తోలలేదా? మేము చిన్న నాయకులమైనా పర్వాలేదు. ప్రజల కోసం పనిచేస్తాం.
సాయిత్రి బాయి ఫూలే మన బోధన్ బిడ్డనే. ఆమె స్ఫూర్తితో నేను పనిచేస్తా. మనకు కావాల్సింది బంగారు తెలంగాణ కాదు…బహుజన తెలంగాణ. బీఆర్ఎస్ హయాంలో నాలుగు ఇండ్లే బంగారు తెలంగాణ అయ్యాయి.
ప్రశాంత్ రెడ్డి, జీవన్ రెడ్డి ఎమ్మెల్యేలు కాకముందు.. ఆ తర్వాత వాళ్ల ఆస్తులు చూస్తే తెలుస్తుంది. చాలా మంది బీఆర్ఎస్ అవినీతిలో నాకు పాత్ర లేదా అని ప్రశ్నిస్తారు?
కానీ బీఆర్ఎస్ అధికారంలోకి వచ్చాక నేను నా కంపెనీని అమ్ముకున్నాను. బీఆర్ఎస్ హయాంలో జరిగిన అవినీతి ద్వారా కొంతమందే బాగుపడ్డారు.”








